బిహార్​ ​: తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి

11 Jun, 2021 13:28 IST|Sakshi

పట్నా: బిహార్ రాష్ట్రం​.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్​1 సర్వీస్​లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. 

వివరాలు.. బిహార్లోని గోపాల్​ గంజ్​ జిల్లాకు  చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్​ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్​ను  సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్​కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్​ శాఖలో అసిస్టెంట్​ ఇంజనీర్​గా పనిచేస్తుంది.

రజియా తండ్రి మహమ్మద్​ అస్లామ్​ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్​గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్​ను జోధ్​పూర్​లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్​ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్​ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్​ను ప్రారంభించింది.

ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్​ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది.

బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్​ బారిన పడి కోలుకున్నానని  చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్​ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. 

చదవండి: Shocking: స్టోర్​లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ..

మరిన్ని వార్తలు