9 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ పంజా

11 Jan, 2021 10:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసిన విషయం తెలిసిందే. బర్డ్ ప్లూ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్‌ ఫ్లూ వెలుగుచూసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ సోకిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. ఫ్లూ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిలిపివేశాయి.

మహారాష్ట్రలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్బనీ ప్రాంతంలో రెండు రోజుల్లోనే దాదాపు 800 కోళ్లు, పక్షులు మృతిచెందాయని ఆ జిల్లా కలెక్టర్‌ మధుకర్‌ ముగ్లికర్‌ తెలిపారు. మురుంబా గ్రామంలో 8 కోళ్ల ఫారాలలో 8 వేల కోళ్లు ఉన్నాయని.. వాటిని చంపేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ మీడియాకు చెప్పారు. ఫ్లూ నేపథ్యంలో చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ రాష్ట్రంలో ఫ్లూ ప్రబలిందేమోనని ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఫ్లూ విస్తరిస్తున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. పార్లమెంటరీ వ్యవసాయ స్టాండింగ్‌ కమిటీ అధికారులు కేంద్ర పశు సంవర్ధక శాఖఅధికారులతో చర్చలు చేస్తున్నారు. నివారణ మందుపై సోమవారం (జనవరి 11) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. మొట్టమొదటిసారిగా బర్డ్‌ ఫ్లూ 2006లో వెలుగులోకి వచ్చింది.

చదవండి: టీకా పంపిణీలో ‘కోవిన్‌’ కీలకం

మరిన్ని వార్తలు