పుట్టిన రోజు వేడుకలతో వ్యాపించిన కరోనా 

1 Mar, 2021 16:52 IST|Sakshi

ఒకే కాలనీలో 22 కోవిడ్‌ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

 తాజాగా 16,752 కేసులు

గురుగ్రామ్‌: హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలు కరోనా వ్యాప్తి చెందేందుకు కారణమైంది. సెక్టార్‌ 67లోని ఐరియో విక్టరీ వ్యాలీలో ఉన్న ఓ హౌసింగ్‌ సొసైటీలో ఈ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న జరిగిన ఈ కార్యక్రమం కారణంగా 22 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాలనీ చుట్టుపక్కల ఉన్న 2000 మంది శాంపిళ్లను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో ఇప్పటికే 500 మంది శాంపిళ్లను సేకరించినట్లు స్థానిక వైద్యశాఖాధికారులు చెప్పారు. మొత్తం 30 టవర్లు ఉన్న కాలనీలో నాలుగు టవర్లను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలను నిషేధించారు. గురుగ్రామ్‌లో ప్రస్తుతం 270 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వీరేంద్ర యాదవ్‌ పిలుపునిచ్చారు.

పెరుగుతున్నకరోనా కేసులు.. నెల రోజుల్లో ఇదే అధికం 
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో 16,752 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. నెల రోజుల్లో ఒకే రోజు నమోదైన అధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధిక శాతం కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. ఎనిమిది రాష్ట్రా ల్లో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయని, శనివారం కరోనా కారణంగా 113 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,051కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,07,75,169కు చేరుకుంది.

దీంతో మొత్తం రికవరీ రేటు 97.10 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,64,511గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.48  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.42గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 21,62,31,106 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం 7,95,723 పరీక్ష లు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య క్రమం గా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.

చదవండి: కొత్త నిబంధనలు: పెళ్లికి ‘తిప్పలు’

మరిన్ని వార్తలు