కాంగ్రెస్‌ పనైపోయింది: మోదీ

26 Mar, 2023 04:39 IST|Sakshi

కర్ణాటకలో సుడిగాలి పర్యటన

సాక్షి, బళ్లారి/ కృష్ణరాజపురం: కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కుట్రపూరిత రాజకీయాలను రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని పార్టీ నేతల జేబులు నింపే ఏటీఎంలాగా మార్చాలని కాంగ్రెస్‌ చూస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో శనివారం ప్రధాని విస్తృతంగా పర్యటించారు. బెంగళూరులో కేఆర్‌ పురం–వైట్‌ఫీల్డ్‌ నూతన నమ్మ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు.

టిక్కెట్‌ కొని ప్రయాణించారు. రైలు సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత చిక్కబళ్లాపురలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమాధిని, మ్యూజియాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం దావణగెరెలో విజయ సంకల్పయాత్రలో ప్రసంగించారు. భారీ రోడ్‌ షో ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. ‘‘ఇది విజయ సంకల్పయాత్రలా లేదు. రాష్ట్రంలో బీజేపీ విజయోత్సవ సభలా ఉంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్లే కర్ణాటకలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. దేశాభివృద్ధే బీజేపీ మంత్రం’’ అన్నారు.

మోదీ వైపు పరుగెత్తుతూ వచ్చిన ఓ వ్యక్తి
దావణగెరె రోడ్‌షోలో మోదీ వైపు ఓ వ్యక్తి పరుగెత్తుతూ రావడం కలకలం రేపింది. భద్రతా సిబ్బందిని తప్పించుకుని మోదీ ప్రయాణిస్తున్న కారు వైపు దూసుకొచ్చిన ఆ వ్యక్తిని పోలీసులు ముందుగానే పట్టుకున్నారు. ఈ విషయంలో ఎటువంటి భద్రతా పరమైన ఉల్లంఘన చోటుచేసుకోలేదని పోలీసులు చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కొప్పాల్‌కు చెందిన ఆ వ్యక్తిని విచారిస్తున్నామని ఎస్‌పీ రిష్యంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు