గుట్కా తినండి, మందు తాగండి.. సేవ్‌ వాటర్‌!: బీజేపీ ఎంపీ కామెంట్ల దుమారం

8 Nov, 2022 08:09 IST|Sakshi

భోపాల్‌: కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ఆ చితూచి మాట్లాడడం చాలా అవసరం. అయినా కూడా ఏదో ఒక దగ్గర కొందరు తమ నోటికి పని చెప్తూ.. విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు అలాంటి వ్యాఖ్యలే చేశారు. 

మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎంపీ జనార్ధన్‌ మిశ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. నీటి సంరక్షణ అంశంపై మాట్లాడుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లందరినీ షాక్‌కు గురి చేశాయి. అప్పటిదాకా ఆయన చేసిన వ్యాఖ్యలను ఆసక్తిగా విన్న జనం.. చివర్లో ఆయన ఇచ్చిన ట్విస్ట్‌తో కంగుతిన్నారు.

రేవా ఎంపీ జనార్ధన్‌ మిశ్రా.. తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో.. ‘‘నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయి. కాబట్టి, వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. గుట్కా అయినా తినండి.. లేదంటే ఆల్కాహాల్‌ అయినా తాగండి.. లేదంటే మత్తు పదార్థాలకు ప్రత్యామ్నాయాలనైనా ప్రయత్నించండి. కానీ, నీటి విలువను అర్థం చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

రేవా కృష్ణరాజ్‌ కపూర్‌ ఆడిటోరియల్‌లో ఆదివారం ఈ వర్క్‌షాప్‌ జరగ్గా.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం వైరల్‌ అవుతోంది. అంతేకాదు.. ఒకవేళ రేపు ఏ ప్రభుత్వమైనా నీటి పన్నులు మాఫీ చేస్తామని ప్రకటిస్తే.. వాళ్లకు ఒక మాట చెప్పండి. నీటి పన్నులే చెల్లిస్తాం, దానికి బదులుగా కరెంట్‌ బిల్లులతో సహా మిగతా పన్నులన్నీ మాఫీ చేయమండి డిమాండ్‌ చేయండి అంటూ సలహా ఇచ్చారు మిశ్రా. 

మిశ్రా ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన ఆయన ఘనత ఈ మధ్యే తెగ వైరల్‌ అయ్యింది కూడా.

ఇదీ చదవండి: ‘డబుల్‌ ఇంజన్‌’కు అగ్నిపరీక్ష

మరిన్ని వార్తలు