‘వారు సంస్కారవంతులు’.. బిల్కిస్‌ బానో దోషులకు బీజేపీ ఎమ్మెల్యే మద్దతు

19 Aug, 2022 07:22 IST|Sakshi

బిల్కిస్‌ బానో అత్యాచార కేసులో 11 మంది నిందితులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈక్రమంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే దోషులకు మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్‌ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, వారు సంస్కారవంతులని గుజరాత్‌లోని గోద్రా బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రౌల్‌జీ చెప్పారు. ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలోని ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే రౌల్‌జీ ఒక సభ్యుడు కావడం గమనార్హం.

‘వారు నేరం చేశారో లేదో నాకు తెలియదు. కానీ, నేరం చేసే ఉద్దేశం ఉండి ఉండాలి. వారిలో కొంత మంది బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులు. వారిని శిక్షించాలని కొందరి దురుద్దేశం అయి ఉండవచ్చు. జైలులో ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు.’ అని పేర్కొన్నారు సీకే రౌల్‌జీ. ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

బిల్కిస్‌ బానో కేసు
2002 గుజరాత్‌ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్‌ జిల్లా లింఖేధా మండలం రంధిక్‌పూర్‌లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్‌ బానోస్‌ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్‌ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్‌ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్‌ వయసు 21 ఏళ్లు.  ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్‌, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే.

ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్‌ ఆవేదన

మరిన్ని వార్తలు