‘ఐజీకి ఎంత లంచమిచ్చావు? ఇక్కడ అన్నీ నేనే’

7 May, 2022 06:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(బెంగళూరు): చిక్కమగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎం.పి. కుమారస్వామి ఒక ఎస్‌ఐకి ఫోన్‌ చేసి దూషించారు. ఇటీవల మల్లందూరు పోలీసుస్టేషన్‌కు కొత్తగా నియమితుడైన ఎస్‌ఐ రవీశ్‌కు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి తిట్లందుకున్నారు. ఆ స్టేషన్‌కు రావద్దని ముందుగానే చెప్పా కదా. వాపస్‌ వెళ్లిపో. నా కాల్‌ను రికార్డు చేసుకున్నా పర్వాలేదు. రేపే అక్కడ నుంచి బదిలీ చేయిస్తా. ఇక్కడకి రావడానికి ఐజీకి ఎంత లంచం ఇచ్చావు. ఐజీ ఎవరు? మూడిగెరెకి అన్నీ నేనే. నన్ను కలవడానికి వస్తే ఉతికి పంపుతా అని మరికొన్ని మాటలతో అసభ్యంగా దూషించారు. ఈ ఆడియో వ్యాప్తి చెందింది. ఎస్‌ఐని తిట్టిన మాట వాస్తవమని ఎమ్మెల్యే చెప్పారు. అవినీతిపరుడు తన నియోజకవర్గానికి అవసరం లేదని అన్నారు.

మరో ఘటనలో..
డీవైఎస్పీ కార్యాలయం ముందు ధర్నా

దొడ్డబళ్లాపురం: నిందితులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారంటూ దొడ్డ పట్టణంలో డీవైఎస్పీ కార్యాలయం ముందు ప్రజా విమోచనా చళువళి (పీవీసీ) కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీవీసీ కార్యకర్తలు దొడ్డ తాలూకా కనకేనహళ్లిలో మూడు రోజుల క్రితం దళితులు నివసిస్తున్న గుడిసెలకు ముత్తురాజేగౌడ, ఈయన కుమారుడు మధు అనుచరులతో కలిసి నిప్పంటించారన్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలతో దొడ్డబెళవంగల పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితులను బయట నిల్చోబెట్టి, నిందితులను లోపల కుర్చీలు వేసి కూర్చోబెట్టారని ఆరోపించారు. వినతిపత్రం స్వీకరించిన డీవైఎస్పీ నాగరాజు నిందితులను తప్పకుండా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. 

చదవండి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్‌ అప్రమత్తమైనప్పటికీ..

మరిన్ని వార్తలు