ప్రధాని పర్యటనపై కేసీఆర్‌కు కడుపు మంట ఎందుకు?: ఎంపీ లక్ష్మణ్‌

9 Nov, 2022 12:55 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ, డాక్టర్‌ లక్ష‍్మణ్‌. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్‌ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు.

‘కేంద్ర నిధుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ప్రధాని. బీజేపీని, మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉన్నది.. అందుకే మునుగోడులో 40శాతం ఓట్లు బీజేపీకి వేశారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ. 6,000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారు. దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసనల్లో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్‌కి వచ్చిన కడుపు మంట ఏంటి? తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు ఏమైంది? హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. 

ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రొటోకాల్‌ రగడ!.. కేసీఆర్‌ను పిలవరా? 

మరిన్ని వార్తలు