నీళ్ల బదులు శానిటైజర్‌ తాగిన కమిషనర్‌

3 Feb, 2021 16:38 IST|Sakshi

సాక్షి, ముంబై : నీళ్ల బాటిల్‌ అనుకుని పొరపాటున శానిటైజర్‌ తాగిన ఘటన సోషల్‌ మీడియాలో నవ్వులు తెప్పిస్తోంది. కొద్దిగా శానిటైజర్‌ తాగిన అనంతరం వెంటనే సిబ్బంది అప్రమత్తమవడంతో ఆయన శానిటైజర్‌ను ఉమ్మేసి అనంతరం నీళ్లు తాగారు. శానిటైజర్‌ తాగినట్లు గుర్తించిన ఆ అధికారి నవ్వడంతో తోటి అధికారులు కూడా నవ్వుకున్నారు. ఈ ఘటన బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో జరిగింది.

2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేశ్‌ పవార్‌ సమర్పిస్తున్నారు. నివేదిక ఇచ్చిన అనంతరం అందరూ కూర్చున్న సమయంలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నీళ్ల బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ డబ్బాను తీసుకొని తాగారు. ఆయన వెంట నిల్చున సహాయక సిబ్బంది వెంటనే గమనించి వారించారు. అయితే అప్పటికే ఆయన కొద్దిగా శానిటైజర్‌ తాగారు. వెంటనే ఉమ్మి వేసి నవ్వారు. అనంతరం సిబ్బంది నీళ్ల సీసా అందించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు