వైరల్‌: పెళ్లికి వరుణుడి దెబ్బ.. వినూత్న మార్గం ఎంచుకున్న ప్రేమ జంట

28 Jul, 2021 14:35 IST|Sakshi

ముంబై (కొల్హాపూర్): మహారాష్ట్రలోని పలు నగరాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే క్రమంలో సాంగ్లి నగరాన్ని  కూడా వరదలు వదల్లేదు. అయితే వరద నీరు పోటెత్తడంతో పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ప్రేమికుల జంటకు ఈ నెల (జూలై) 23న నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసే సమయానికి ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి.

అయితే, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాయిదా వేయడం ఎందుకని ఆ ప్రేమ జంట, వారి కుటుంబ సభ్యులు అడుగు ముందుకేవేశారు. వరద నీటిలో బోట్లతో పరిమిత సంఖ్యలోనే బంధువులను తరలించారు. మిగతా పనులనూ చక్కబెట్టారు. ఇక అనుకున్న ముహూర్తానికి జులై 26న జరిగిన ఈ వివాహం హాట్‌ టాపిక్‌గా మారింది. వధూవరులు బోట్లలో వెళ్తున్న వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. 

ఈ విషయంపై పెళ్లి కొడుకు రోహిత్‌ సూర్య వంశీ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేశాం. కానీ వర్షం వల్ల మరో చోటుకి మార్చాం. కొద్దిమంది అతిథులతో సోనాలి (పెళ్లి కూతురు) ఇంట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికోసం ఓ పడవను ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి మళ్లీ తిరిగి ఇంటికి రావాలి. అందువల్ల మళ్లీ పడవలో తిరిగి ఇక్కడికి చేరుకున్నాం. అంతే కాకుండా కోవిడ్‌కు సంబంధించిన అన్ని రకాల నిబంధనలను పాటించి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం.

ఇప్పటికే పెళ్లి వేడక కోసం అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేశాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెళ్లి తేదీని వాయిదా వేసే ప్రసక్తి లేదని నిర్ణయించుకుని ముందుకు సాగాం. ఇక పెళ్లి తర్వాత  బరాత్‌ కార్యక్రమం ఉంటుంది. కానీ దాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది.’’ అని తెలిపాడు. దీనిపై  నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీ పట్టుదలకు వందనాలంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని వార్తలు