11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా

16 Sep, 2020 11:15 IST|Sakshi

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద  ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఘోరంగా కుళ్లిపోయి, దయనీయ స్థితిలో మృతదేహం పడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి మార్చురీలోని స్ట్రెచర్ మీద దాదాపు అస్థిపంజరంలా మారిన డెడ్ బాడీ అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. 

వివరాలను పరిశీలిస్తే..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గత 11 రోజులుగా అక్కడ పడి ఉంది. కుళ్లి కంపుకొడుతున్నాసిబ్బంది పట్టించుకోలేదు. చివరికి అస్థిపంజరంలా మారి భయం గొల్పుతూ ఉండటంతో ఆసుపత్రిలోని ఇతరులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.  సోషల్ మీడియాలో దీనికి సంబంచిన ఫోటో వైరల్ అయింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఏదైనా ఎన్జీవో, లేదా ఇండోర్‌కు చెందిన పౌర సంస్థ కోసం వస్తుందని ఎదురుచూస్తున్నామని అందుకే అలా స్ట్రెచర్ మీదే ఉంచినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధ్యులైన వారికి నోటీసులు ఇవ్వనున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఎస్ ఠాకూర్ తెలిపారు. రోజూ సుమారు 16-17మృతదేహాలు వస్తాయనీ, జిల్లాలో కరోనాతో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. దీంతో మార్చురీపై భారం పెరిగిందనీ, ఫ్రీజర్‌ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న ఇప్పటికే కోరామని ఆయన చెప్పారు. కాగా ఒకదానికి బదులుగా మరో మృతదేహాన్ని  అప్పగించిన  వైనం ఇటీవల కలకలం రేపింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో తమ కుమారుడి బదులుగా వేరే బాడీని అప్పగించిందంటూ ఆ కుటుంబం ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు