కంగనా ఆఫీస్‌ కూల్చివేత.. హైకోర్టు కీలక తీర్పు

27 Nov, 2020 11:54 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసును బ్రిహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. పిటిషనర్‌కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. (కంగనాను అరెస్టు చేయకండి: హైకోర్టు)

ఈ క్రమంలోనే బీఎంసీ అధికారులు నిర్ణయాన్నీ సవాలు చేస్తూ ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో పేర్కొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాడి న్యాయస్థానంలో కంగనా విజయం సాధించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు