పెళ్లిలో కుప్పకూలి వధువు మృతి.. తెల్లారి సోదరితో వివాహం

24 Feb, 2023 21:37 IST|Sakshi

విధి రాతను ఎవరూ మర్చలేరని అంటుంటారు. మనిషి జీవితంలో కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే విధి మరోలా తలుస్తుంది. ఒక్క ఘటన మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే పెళ్లింట విషాదాన్ని నింపింది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది.. అయినా పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడుకి వధువు కుటుంబం మరో ఆఫర్‌ ఇవ్వడంతో ముహుర్తం సమాయానికి వివాహం​ జరిగింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని భావనగర్‌ జిల్లాలోని సుభాష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన జినాభాయ్‌ భాకాభాయ్‌ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, వివాహ వయసు రాగానే తన పెద్ద కూతురుకు హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌తో పెళ్లి ఫిక్స్‌ చేశారు. కాగా, ముహుర్తం ప్రకారం.. వీరికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని గంటల్లో పెళ్లి అనగా వరుడు విశాల్‌.. వధువు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరాడు. 

వరుడు విశాల్‌ ఎంతో ఆనందంలో ఎన్నో ఆశలతో బంధువులతో కలిసి బ్యాండ్‌ మేళాల మధ్య పెళ్లి వేడుకకు వద్దకు చేరుకున్నాడు. దీంతో, పెళ్లి ఇంట అందరూ ఎంతో ఆనందంగా ఉన్నవేళ.. పెళ్లి కూతురు ఒక్కసారిగా స్పృహ తప్పి కూప్పకూలింది. దీంతో, కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. వధువు అప్పటికే మృతిచెందినట్టు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, వధువుకు గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. 

ఇదిలా ఉన్న సమయంలో వధువు కుటుంబం.. తన కూతురు చనిపోయిన బాధను దిగమింగుకుంది. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్‌కు తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని వరుడు కుటుంబం కూడా ఒప్పుకుంది. దీంతో, హేతల్‌ డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచి.. మరో ముహుర్తం పెట్టించి శుక్రవారం పెళ్లి జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు