అత్యవసరంగా విచారణ చేపట్టండి.. ఈడీ నోటీసులతో మరోసారి సుప్రీంకు కల్వకుంట్ల కవిత

16 Mar, 2023 20:44 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇవాళ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె.. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరుతూ  సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

రేపు (శుక్రవారం) తమ పిటిషన్‌ అత్యవసర  విచారణ జరపాలని ఆమె కోరనున్నట్లు తెలుస్తోంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ అత్యవసర విచారణ చేపట్టాలని, ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ మేరకు తనకు జారీ చేసిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన లాయర్‌ ద్వారా కోరనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవాళ ఈడీ విచారణకు ఆమె హాజరు కాకపోవడం, ఈ వెంటనే 20వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందేనని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు తిరుగుపయనం కావాల్సిన ఆమె.. అక్కడే ఢిల్లీలో ఉండే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అనంతరం ఆమె సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు