బెంగళూరులో రాత్రి కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా   

20 Apr, 2021 02:03 IST|Sakshi
బెంగళూరులో నైట్‌ కర్ఫ్యూ విధించడంతో నిర్మానుష్యంగా మారిన ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌  

రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు బంద్‌ 

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండగా ప్రభుత్వం పలు కఠిన చర్యలకు నాంది పలికింది. తక్షణం అమల్లోకి వచ్చేలా రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. బెంగళూరులో రోజూ 10 వేలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. విధానసౌధలో రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ అధ్యక్షతన పలువురు సీనియర్‌ మంత్రులతో సమావేశం జరిగింది. కోవిడ్‌కు గురై ఆస్పత్రిలో ఉన్న సీఎం యడియూరప్ప వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు నిర్ణయించారు.  

లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా .. 
ప్రతి శని, ఆదివారాల్లో బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించాలని మంత్రులు సూచించగా సీఎం అంగీకరించలేదు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోతామన్నారు. స్కూళ్లు, మాల్స్, కళ్యాణ మండపాలు తదితరాలను కొంతకాలం మూసేయాలని చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప మంగళవారం ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిపి మరిన్ని చర్యలు తీసుకుంటారని సమాచారం.

>
మరిన్ని వార్తలు