సరిహద్దుల్లో సొరంగం

30 Aug, 2020 04:03 IST|Sakshi

చొరబాట్ల కోసం 20 అడుగుల మేర నిర్మించిన పాక్‌

గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు

జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్‌ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్‌ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్‌) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్‌ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్‌ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు.

సరిహద్దుల నుంచి భారత్‌ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్‌లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ ఆస్తానా సాంబా సెక్టార్‌లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్‌ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది.

ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్‌లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్‌లో వేల్‌బ్యాక్‌ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్‌గఢ్‌ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్‌ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్‌ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్‌ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్‌ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్‌ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు.

పాక్‌కు తెలిసే చేసింది
ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్‌ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ఎస్‌ జమ్వాల్‌ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్‌ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్‌ సాంబ సెక్టార్‌లోనే ఉంటూ పాక్‌ ఇంకా ఎక్కడెక్కడ  సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు