అసెంబ్లీ ఎన్నికలు: ఆ నాలుగు రాష్ట్రాలపై వరాల జల్లు

1 Feb, 2021 14:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది. రానున్న ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసింది. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్‌పై బడ్జెట్‌లో స్పష్టమైన మార్కును చూపెట్టింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రూ.లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధితో పాటు లక్షా 18వేల కి.మీ మేర రైల్వే లైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. (కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ 2021-22)

అలాగే బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు నిధులను తమిళనాడుకు సమకూర్చింది. రానున్న మరో ఆరునెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్శించే విధంగా నిధుల కేటాయింపులు జరిపింది. మరోవైపు ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్‌పై సైతం కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.  మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. బెంగాల్‌లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్‌లో నిధులు సమీకరించింది. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. అసోం, బెంగాల్‌, కేరళలో ఐదు ప్రత్యేక జాతీయ అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 

అలాగే ఈ కేరళకు సైతం నిధులు భాగానే వడ్డించింది. కొచ్చి మెట్రోరైలు ఫేజ్‌-2 అభివృద్ధికి రూ.1957 కోట్లు కేటాయింపులు జరిపింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయాలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది. మరోవైపు బెంగళూరు, నాగ్‌పూర్‌, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి రూ.14,788 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. మరోవైపు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంపై కూడా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ వరాల జల్లు కురిపించింది. అసోంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరిపింది.

Poll
Loading...
మరిన్ని వార్తలు