కారిడార్లు కీలకం

2 Feb, 2021 08:37 IST|Sakshi

న్యూఢిల్లీ : రహదారులు, ఉపరితల రవాణాకు బడ్జెట్‌లో రూ.1.18 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. హైవే కారిడార్ల అభివృద్ధిని ప్రాధాన్యత కింద చేపడతామన్నారు. గతేడాది ఉపరితల రవాణాకు రూ.91,823 కోట్లు కేటాయించగా సవరించిన అనంతరం రూ.1.01 లక్షల కోట్లకు చేరుకుంది. ఈసారి రోడ్లు, ఉపరితల రవాణా శాఖకు రూ.1,18,101 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటాయిస్తున్నామని, ఇప్పటివరకు ఇదే అత్యధికమని చెప్పారు. ప్రాధాన్యత కారిడార్లు, ప్రాజెక్టులు 2021 –22లో చురుగ్గా సాగుతాయని చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపులు ఆచరణాత్మకంగా ఉన్నాయని, దేశంలో దీర్ఘకాలం పాటు మౌలిక వసతులను పటిష్టం చేయడంలో ఈ చర్యలు ఉపకరిస్తాయని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.    కారిడార్లు, రహదారుల నిర్మాణానికి అధిక నిధులు

7టెక్స్‌టైల్‌ పార్కులు.. హైవే కారిడార్లు..  
భారతమాల పరియోజన పథకం కింద రూ.3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కి.మీ. రహదారుల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటికే 3,800 కి.మీ. మేర పూర్తయింది. 2022 మార్చి నాటికి మరో 8,500 కి.మీ. నిర్మాణం చేపడతారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 11,000 కి.మీ. నేషనల్‌ హైవే కారిడార్ల నిర్మాణం పూర్తి కానుంది.  

ఆర్థిక కారిడార్లు.. 
తమిళనాడులో 3,500 కి.మీ మేర జాతీయ రహదారుల కోసం రూ.1.03 లక్షల కోట్లు  n కేరళలో 1,100 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.65,000 కోట్లు  n పశ్చిమ బెంగాల్‌లో 675 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.25,000 కోట్లు  n అసోంలో మూడేళ్లలో 1,300 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.34,000 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.19,000 కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులకు ఇది అదనం.   
ప్రజా రవాణాకు పెద్దపీట
♦   27 నగరాల్లో మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్‌ పనులు
♦   ‘మిత్ర’ పథకం కింద 7 టెక్స్‌టైల్‌ పార్కులు
♦   దేశంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం  

ఫ్లాగ్‌ షిప్‌ కారిడార్లు / ఎక్స్‌ప్రెస్‌ వేస్‌.. 
♦   ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే: మిగిలిన 260 కి.మీ పనులు 2021 మార్చి 31లోగా కేటాయింపు. 
♦   బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే: 278 కి.మీ. మేర నిర్మాణం, 2021–22లో పనులు ప్రారంభమవుతాయి.   
♦  కాన్పూర్‌ – లక్నో ఎక్స్‌ప్రెస్‌ వే: జాతీయ రహదారి 27కి ప్రత్యామ్నాయంగా 63 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌ వే పనులను 2021––22లో చేపడతారు.  
♦    ఢిల్లీ – డెహ్రాడూన్‌ ఆర్థిక కారిడార్‌: 210 కి.మీ పొడవైన ఆర్థిక కారిడార్‌ నిర్మాణ పనులు 2021––22లో మొదలవుతాయి.  
♦   రాయ్‌పూర్‌ – విశాఖపట్టణం కారిడార్‌:  చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా 464 కి.మీ. పొడవైన కారిడార్‌ నిర్మాణ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే కేటాయిస్తారు.  2021–22లో పనులు ప్రారంభమవుతాయి. 
♦    చెన్నై – సేలం కారిడార్‌:  277 కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనులు 2021–22లో మొదలవుతాయి.  
♦    అమృత్‌సర్‌ – జామ్‌నగర్‌ : 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. 
♦    ఢిల్లీ – కాట్రా : 2021–22లో నిర్మాణ పనులు ప్రారంభం.  

అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం
♦    కొత్తగా నిర్మాణం చేపట్టే 4, 6 వరుసల రహదారుల్లో అమలు చేస్తారు.  
♦   స్పీడ్‌ రాడార్లు 
♦    వేరియబుల్‌ మెస్సేజ్‌ బోర్డులు 
♦    జీపీఎస్‌ ఆధారిత రికవరీ వ్యాన్లు 

మరిన్ని చోట్ల మెట్రో కూత.. 
♦    మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడం, సిటీ బస్సు సర్వీసులను పెంచడం ద్వారా పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.  
♦   ప్రజా రవాణాలో బస్సులను ప్రోత్సహించేందుకు కొత్త పథకానికి రూ.18,000 కోట్లు కేటాయించారు. పీపీపీ విధానంలో 20,000కిపైగా బస్సులను నడుపుతారు. ఆటోమొబైల్‌ పరిశ్రమకు నూతనోత్తేజం కల్పించడం, ఆర్థిక వృద్ధి, యువతకు ఉపాధి లక్ష్యంగా  
♦    ప్రస్తుతం 702 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండగా మరో 1,016 కి.మీ మేర మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్‌ నిర్మాణ పనులు 27 నగరాల్లో పురోగతిలో ఉన్నాయి. టైర్‌ –2 నగరాలు, టైర్‌ 1 నగరాల బాహ్య ప్రాంతాల్లో మెట్రో అనుభూతిని చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ‘మెట్రో లైట్‌’ ‘మెట్రో నియో’ పరిజ్ఞానం ఉపకరిస్తుంది.  
♦    కోచి మెట్రో రైలు ఫేజ్‌  –2లో 11.5 కి.మీ. నిర్మాణానికి రూ.1,957.05 కోట్లు  
♦     చెన్నై మెట్రో రైలు ఫేజ్‌ –2లో 118.9 కి.మీ. నిర్మాణానికి రూ.63,246 కోట్లు  
♦   బెంగళూరు మెట్రో రైల్వే ప్రాజెక్టు ఫేజ్‌ 2 ఏ, 2 బీ కింద 58.19 కి.మీ. నిర్మాణానికి రూ.14,788 కోట్లు  
♦    నాగ్‌పూర్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‌ –2కి రూ.5,976 కోట్లు  
♦   నాసిక్‌లో మెట్రో రైలు కోసం రూ.2,092 కోట్లు  

‘పవర్‌’ఫుల్‌ లైన్లు 
139 గిగావాట్ల సామర్థ్యంతో 1.41 లక్షల సర్క్యూట్‌ కి.మీ. పరిధిలో ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, 2.8 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు సదుపాయం గత ఆరేళ్లలో అందుబాటులోకి. డిస్కంల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు విద్యుత్తు వినియోగదారులు తమకు నచ్చిన సంస్థల సేవలను  ఎంచుకునేలా చర్యలు. విద్యుత్తు వ్యవస్థలో సంస్కరణలు, నూతన ఇంధన పంపిణీ విధానం కోసం ఐదేళ్లలో రూ.3,05,984 కోట్లు వ్యయం. 2021–22లో జాతీయ హైడ్రోజన్‌ ఇంధన విధానం అమలు. 

పోర్టులు, నౌకాయానం, జల రవాణా 
♦  మేజర్‌ పోర్టుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో రూ.2,000 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు 2021–22లో అమలు కానున్నాయి.  
♦  భారతీయ షిప్పింగ్‌ కంపెనీలకు అంతర్జాతీయ టెండర్లలో ఐదేళ్లలో 
రూ.1,624 కోట్ల మేర రాయితీలు 
కల్పించనున్నారు.  
♦  2024 నాటికి రీ సైక్లింగ్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా అదనంగా 1.5 లక్షల ఉద్యోగాలను  సృష్టించనున్నారు.  

మరో కోటి మందికి ‘ఉజ్వల’ 
ఉజ్వల పథకాన్ని విస్తరించడం ద్వారా మరో కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. రానున్న మూడేళ్లలో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ పరిధిలో మరో వంద జిల్లాలను చేరుస్తారు.  
గ్రామీణాభివృద్ధికి పథకాలకు ఇలా... 
⇒2021–22 కేటాయింపు: రూ.1,31,519 కోట్లు (9.5% పెంపు) 
⇒2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు (సవరించిన అంచనా: రూ.1,97,377 కోట్లు) 

‘ఉపాధి’కి మరింత దన్ను...  
⇒2021–22 కేటాయింపు: రూ. 73,000 కోట్లు (19% పెంపు) 
⇒2020–21 కేటాయింపు: రూ. 61,500 కోట్లు (సవరించిన అంచనా: రూ. 1,11,500 కోట్లు) 
⇒ 2019–20లో సగటు రోజు కూలీ రూ.182 ఉండగా, దీన్ని 2020–21 ఏప్రిల్‌ 1 నుంచి 10 శాతం పెంపుతో రూ.200కు చేర్చారు. 
⇒  మొత్తం 708 జిల్లాలు, 7,092 బ్లాక్‌లు, 2,68,561 గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలవుతోంది. 
⇒ 2021 జనవరి 29 నాటికి ఈ పథకం కింద 14.82 కోట్ల జాబ్‌ కార్డులు జారీ కాగా, ఇందులో చురుకైన జాబ్‌ కార్డుల సంఖ్య 9.25 కోట్లు. 28.72 కోట్ల మంది కార్మికులు జాబితాలో ఉండగా, 14.4 కోట్ల మంది కార్మికులు చురుగ్గా ఉపాధి పొందుతున్నారు. 

కొనసాగుతున్న విద్యుత్‌ వెలుగులు..
(దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన) 
⇒   2021–22 కేటాయింపు: రూ. 3,600 కోట్లు (20 శాతం తగ్గింపు, కానీ సవరించిన అంచనా ప్రకారం 125 శాతం పెంపు) 
⇒    2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు (సవరించిన అంచనా: రూ.2,000 కోట్లు) 
⇒  ఈ పథకానికి నిధులు 2020–21 సవరించిన అంచనా ప్రకారం చూస్తే 125 శాతం ఎగబాకాయి. 
⇒   గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తేవడం, విద్యుత్‌ సబ్‌–ట్రాన్స్‌మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు.
⇒    2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ను అందించారు. 
⇒    ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 4,000 కోట్ల (సవరించిన అంచనా) నుంచి రూ. 5,300 కోట్లకు పెంచారు.  

గ్రామీణ రోడ్లు.. రయ్‌రయ్‌! 
⇒    2021–22 కేటాయింపు: రూ. 15,000 కోట్లు (30% తగ్గింపు) (9.5% పెంపు) 
⇒   2020–21 కేటాయింపు: రూ. 19,500 కోట్లు (సవరించిన అంచనా రూ.13,706 కోట్లు) 
⇒    2000 సంవత్సరంలో పీఎంజీఎస్‌వై పథకం ఆరంభం నుంచి ఇప్పటిదాకా (2021 జనవరి 20 నాటికి) 1,70,034 గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు.  
⇒  మొత్తం 7,47,990 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లకు ఆమోదం లభించగా, 6,43,999 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. 
⇒   ప్రస్తుత ప్రాజెక్టులను రాష్ట్రాల భాగస్వామ్యంతో పూర్తి చేయాలంటే 2025 నాటికి ఏటా రూ.19,000 కోట్లు అవసరం అవుతాయి. 
⇒ 2021–22 కేటాయింపు: రూ. 12,294 కోట్లు (మారలేదు, కానీ సవరించిన అంచనా ప్రకారం 76% పెంపు) 
⇒   2020–21 కేటాయింపు: రూ.12,294 కోట్లు (సవరించిన అంచనా: రూ.7,000 కోట్లు) 
⇒ 2019 నాటికి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. 
⇒ గ్రామీణ ఎస్‌బీఎం రెండో దశను 2020 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2024–25 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకు రూ.1.4 లక్షల కోట్లను కేటాయించనున్నారు.  
⇒  2020–21లో (డిసెంబర్‌ 2020 నాటికి) 41.61 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్డు, 70,929 కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం (మరో 31,560 నిర్మాణంలో ఉన్నాయి) జరిగింది. ఠి    పట్టణ ప్రాంతాల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు ఐదేళ్ల పాటు ఎస్‌బీఎం 2.0 (రెండో ఫేజ్‌) కోసం రూ.1,41,678 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. 

డిజిటల్‌ ఇండియాకు జోష్‌ (భారత్‌ నెట్‌) 
⇒    2021–22 కేటాయింపు: రూ. 7,000 కోట్లు (17 శాతం పెంపు) 
⇒    2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు (సవరించిన అంచనా: రూ.5,500 కోట్లు) 
⇒    భారత్‌ నెట్‌ కింద 2021 జనవరి 15 నాటికి మొత్తం 1.63 లక్షల గ్రామ పంచాయతీలకు 4.87 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు 
⇒   ఇందులో 1.51 లక్షల గ్రామ పంచాయతీలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 

‘జల్‌ జీవన్‌’కు నిధుల వరద... 
⇒    2021–22 కేటాయింపులు: 50,011 కోట్లు (335% పెంపు)  
⇒   2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు 
⇒   స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు 2019–20లో జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రకటించారు. 
⇒ 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్‌ ఘర్‌ జల్‌) తాగునీటిని (హ్యాండ్‌ పంపులు, కుళాయిలు ఇతరత్రా మార్గాల్లో) అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.3.6           లక్షలకోట్లను వెచ్చించనున్నారు. 
⇒    రాష్ట్రాల సమాచారం ప్రకారం 2020–21 ఏడాదిలో (2020 డిసెంబర్‌ నాటికి) 2.14 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. 
⇒   ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ పథకం కింద కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు దీనికి రూ.1.87 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. 

సొంతింటి సాకారం దిశగా... 
⇒   2021–22 కేటాయింపులు: రూ. 19,500 కోట్లు (మారలేదు) 
⇒    2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు 
⇒  2019 నాటికి గ్రామాల్లో కోటి పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. 2022 నాటికి మరో 1.95 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. 
⇒    పట్టణాల్లో పీఎంఏవై కోసం ఈ ఏడాది 2020–21లో బడ్జెట్‌ అంచనాలకు (రూ.8,000 కోట్లు) మూడింతలు (సవరించిన రూ.21,000 కోట్లు) కేటాయింపులు జరపడం విశేషం. 
⇒   1.09 కోట్ల ఇళ్లకు అనుమతులు లభించగా, ఇప్పటిదాకా 70 లక్షల ఇళ్ల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. 41 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు.

మరిన్ని వార్తలు