కాంగ్రెస్‌ సభలో ఎద్దు హల్‌చల్.. బీజేపీ కుట్రేనటా!

29 Nov, 2022 18:15 IST|Sakshi

గాంధీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. ఎటు వెళ్లాలో తెలియక అటూఇటు పరుగులు పెట్టడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతంలో మంగళవారం జరిగింది. వేదికపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ మాట్లాడుతున్న క్రమంలో ఓ నల్లటి కొమ్ములు తిరిగిన ఎద్దు ఆ సభలోకి ప్రవేశించింది. దీంతో పలువురు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మరోవైపు.. ఎద్దు బెదిరిపోకుండా అంతా నిశబ్దంగా ఉండాలని సీఎం అశోక్‌ గెహ్లట్‌ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీజేపీ సభ్యులు కావాలనే ఎద్దులు లేదా ఆవులను వదులుతున్నారని ఆరోపించారు. సభను చెదరగొట్టేందుకు ఎద్దును బీజేపీనే పంపించిందన్నారు. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్‌ సమావేశాలను భంగపరచాలనే దురుద్దేశంతో తరుచుగా ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిసెంబర్‌ 1, 5వ తేదీల్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 8న ఉండనుంది. మంగళవారంతో తొలివిడత 89 స్థానాల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం

మరిన్ని వార్తలు