మహిళపై గూండాగిరికి సీఎం యోగి రిప్లై.. స్థానికుల చప్పట్ల నడుమ బీజేపీ నేత అక్రమ కట్టడాల కూల్చివేత

8 Aug, 2022 17:54 IST|Sakshi

నొయిడా: బుల్డోజర్‌ చర్యలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటిదాకా కమ్యూనల్‌కు సంబంధించిన కోణంలోనే ఇంతదాకా ఈ తరహా  ప్రతిచర్యలు చూశాం. అయితే తాజాగా నోయిడాలో బుల్డోజర్‌తో అక్రమ కట్టడాలను కూల్చేయడం, అందునా ఆ కట్టడాలు బీజేపీ నేతవి కావడం, ఆదేశాలకు సీఎం యోగి స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

యూపీ, నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్‌ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇవాళ నొయిడా సెక్టార్‌-93లోని గ్రాండ్‌ ఒమాక్సే హౌజింగ్‌ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు సంబంధిత అధికారులు.

ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్‌ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్‌ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్‌ అనుచరులు మరోసారి హౌజింగ్‌ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్‌ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్‌ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్‌ డ్రైవర్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు వాళ్లంతా.

త్యాగికి దెబ్బలు ఇక్కడితోనే ఆగిపోలేదు. నోయిడాలోని భంగెల్‌ మార్కెట్‌లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తనిఖీలు జరిగాయి.అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్‌-రిషికేష్‌ మధ్య అతని సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్‌ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. 

బీజేపీ కిసాన్‌ మోర్చా నేతగా చెప్పుకుంటున్న శ్రీకాంత్‌ త్యాగి.. గతంలో బీజేపీ పెద్దలతో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు కూడా దిగాడు. అంతేకాదు ఆ ట్యాగ్‌తోనే దందాలు సైతం నడిపిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన అతను గ్రాండ్‌ ఓమాక్సే సొసైటీలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. గతంలోనూ నోయిడా అథారిటీ అతనికి అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది. అయితే.. బీజేపీ నేత కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వివాద నేపథ్యంలో అతను తమ పార్టీ సభ్యుడు కాదంటూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు