కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు

29 Sep, 2022 06:22 IST|Sakshi

జూలై 1 నుంచి వర్తింపు  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు  కరువు భత్యాన్ని (డీఏ),  4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది.  ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది.  

మరో మూడు నెలలు ఉచితంగా రేషన్‌
కరోనా సంక్షోభ సమయంలో లాక్‌డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్‌ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్‌ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్‌ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్‌ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్‌ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్‌ని తీసుకుంటున్నారు.  

రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు
రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్,  ముంబై సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు