వరికి మద్దతు ధర రూ. 72.. అత్యధికంగా నువ్వులపై 452 పెంపు

10 Jun, 2021 05:12 IST|Sakshi

కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కామన్‌ రకానికి క్వింటాలుకు రూ. 1,940

పత్తిపై క్వింటాల్‌కు రూ. 211 పెంపు 

అత్యధికంగా నువ్వులపై రూ. 452

సాక్షి, న్యూఢిల్లీ: వరికి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఈ కమిటీ సమావేశమైంది. వరి ధాన్యం కామన్‌ గ్రేడ్‌ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,868 ఉండగా రూ.72 పెంచుతూ... రూ. 1,940గా నిర్ధారించింది. ఈ ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ. 1,293గా అంచనా వేసింది. వరి ధాన్యం గ్రేడ్‌ ఏ రకం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1,888 ఉండగా రూ.72 పెంచుతూ రూ.1,960గా ఖరారు చేసింది.

రైతులకు సహేతుకంగా, న్యాయమైన రీతిలో గిట్టుబాటు ధర లభించేలా 2018–19 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన అత్యధికంగా సజ్జలకు పెట్టుబడిపై 85 శాతం, మినుములకు 65 శాతం, కందులకు 62 శాతం ప్రతిఫలం దక్కుతుందని పేర్కొంది. ఈ సీజన్‌లో పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పప్పు గింజల్లో అత్యధిక ఉత్పాదకత ఉన్న రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో అదనంగా 6.37 లక్షల హెక్టార్లలో నూనె గింజల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. కనీస మద్దతు ధర పెంపుతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

మెరుగవనున్న రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్‌
రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్‌ వ్యవస్థలను మరింత ఆధునీకరించేందుకు 700 మెగా హెడ్జెస్‌ బ్యాండ్‌లో 5 మెగా హెడ్జెస్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. స్పెక్ట్రమ్‌ పెరగడంతో రైల్వే ప్రయాణికుల భద్రత మరింత పెరగడంతోపాటు రైల్వేల రవాణా నెట్‌వర్క్‌ నవీకరణ సుసాధ్యం కానుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు.లాంగ్‌–టర్మ్‌–ఎవల్యూషన్‌(ఎల్‌టీఈ) ఆధారిత మొబైల్‌ ట్రెయిన్‌ కమ్యూనికేషన్‌ను ఆయా రూట్లలో రైల్వే ఉపయోగించుకోనుంది. దీనికి సంబంధించిన రూ.25 వేల కోట్ల ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయనున్నారు.

  పంట              ఎమ్మెస్పీ (రూ.)          పెంపు(రూ.)    
వరి(కామన్‌)          1,940                    72    
వరి (ఏ)                1,960                       72
జొన్న(హైబ్రిడ్‌)          2,738         118    
జొన్న(మల్దండి)    2,758    118
సజ్జలు    2,250    100    
రాగి    3,377    100    
మొక్కజొన్న    1,870    20    
కందులు    6,300    300    
పెసర    7,275    79    
మినుములు    6,300    300    
వేరుశనగ    5,550    275    
పొద్దుతిరుగుడు    6,015    130    
నువ్వులు    7,307    452    
ఒడిసలు(నైగర్‌సీడ్‌)    6,930    235    
పత్తి (మీడియం స్టేపుల్‌)    5,726    211    
పత్తి(లాంగ్‌ స్టేపుల్‌)    6,025    200    

మరిన్ని వార్తలు