అర్థంలేని ముచ్చట్లతో కొవిడ్‌తో పోరాడలేం - రాహుల్‌గాంధీ

30 May, 2021 14:55 IST|Sakshi

మన్‌ కీ బాత్‌పై రాహుల్‌ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ : అర్థంపర్థం లేని ముచ్చట్లలో కొవిడ్‌తో పోరాడలేమన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. కొవిడ్‌పై విజయం సాధించాలంటే అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళికలు అవసరమన్నారు. అంతేకాని ప్రధాని పదవిలో ఉండి మన్‌ కీ బాత్‌ పేరుతో అక్కరకు రాని ముచ్చట్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనికి రాని మాటలతో  కొవిడ్‌తో పోరాడలేమని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మేరకు  ఆయన ట్వీట్‌  చేశారు.

మన్‌ కీ బాత్‌
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ నెల చివరి ఆదివారం మన్ కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రసంగిస్తున్నారు నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు 77 సార్లు మన్‌ కీ బాత్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. మన్‌ కీ బాత్‌లో వివిధ అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తుంటారు. ఈసారి టౌటే, యాస్‌ తుపానులతో పాటు కొవిడ్‌ సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది చేసిన సేవలను ఆయన కొనియాడారు. 
కాంగ్రెస్‌ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థత కారణంగానే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. సరైన వ్యాక్సిన్‌ ప్రణాళిక ఉండి ఉంటే దేశం కరోనా సెకండ్‌వేవ్‌ లాంటి గడ్డు పరిస్థితిని చూసి ఉండేది కాదని విమర్శలు ఎక్కు పెట్టారు. తాజాగా మన్‌ కీ బాత్‌పై కూడా విమర్శలు మొదలుపెట్టారు కాంగ్రెసఖ్‌ నేతలు.

మరిన్ని వార్తలు