సైకిల్‌ను ఢీకొట్టి కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్‌

7 Jan, 2023 10:41 IST|Sakshi

లఖ్‌నవూ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అంజలి సింగ్‌ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌ ప్రాంతంలో జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ విద్యార్థిని ఢీకొట్టిన కారు సుమారు కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లింది. కారును ఆపాలని స్థానికులు ఎంత అరిచినా అలాగే వేగంగా దూసుకెళ్లాడు డ్రైవర్‌. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

కొత్వాలి నగర పరిధికి చెందిన కేతన్‌ అనే విద్యార్థి కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లేందుకు సైకిల్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన క్రమంలో కారు వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో అతడి కాలు కారు వెనకాల బంపర్‌లో చిక్కుకుపోయింది. అలాగే సుమారు కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్‌. కేతన్‌ను గమనించిన స్థానికులు కారును ఆపేందుకు పెద్దగా అరస్తూ వెంట పరిగెత్తారు. కిలోమీటర్‌ వెళ్లాక ఆపడంతో డ్రైవర్‌ను బయటకి లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. బాధితుడిని స్థానిక వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో ట్విస్ట్‌.. గొడవ పడ్డ అంజలి, నిధి

మరిన్ని వార్తలు