Viral Video: అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు...ముగ్గురు చిన్నారులకు గాయాలు

18 Dec, 2022 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ బ్రెజ్‌ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఐతే ఆ కారు అదుపుతప్పి అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్న పిల్లలను ఢీకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు టైరు పేలి ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కొందరూ చిన్నారులకు సాయం అందించగా, మరికొందరూ సదరు కారు డ్రైవర్‌ని అడ్డుకుని అందులోని మరో వ్యక్తిని బంధించారు.

ఆ తర్వాత  ఆ ఇద్దర్నీ పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. వాస్తవానికి ఆ సమయంలో డ్రైవర్‌ తాగి ఉన్నాడని, ఈ ప్రాంతంలో పాఠశాల ఉందని స్థానికులు హెచ్చరించిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా,  గాయపడిన ఇద్దరు చిన్నారులు పరిస్థితి నిలకడగానే ఉంది. మరో ఆరేళ్ల బాలుడు మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్‌ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు)

మరిన్ని వార్తలు