యువతి చేతికి బస్సు స్టీరింగ్‌.. ప్రాణాలు గాల్లో కలిసేవి!

18 Apr, 2022 17:29 IST|Sakshi

ప్రయాణికులతో నిండిన ఓ బస్సును నడిపించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించాడో డ్రైవర్‌. అతని అజాగ్రత్త వల్ల బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఆ డ్రైవర్‌ ఏం చేశాడంటే.. ప్రయాణికులతో నిండిన బస్సును తాను నడపకుండా ఓ విద్యార్థినికి స్టీరింగ్‌ ఇచ్చాడు. ఆమె బస్సును ప్రమాదకరంగా నడిపించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఉధంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో డ్రైవర్‌.. బస్సు స్టీరింగ్‌ను ఓ యువతి చేతికి ఇచ్చాడు. పైగా అది ఒక కొండ మార్గం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యంగా సదరు యువతితో బస్సును ప్రమాదకరంగా నడిపించాడు. 

ఈ సమయంలో  బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. అది కాస్త జమ్ముకశ్మీర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి.. యువతి డ్రైవ్‌ చేసిన బస్సును సీజ్‌ చేసినట్లు తెలిపారు.

ఆ డ్రైవర్‌పైన అధికారులు చర్యలు చేపట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం పర్మిట్‌ను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అతని నిర్లక్ష్యంపై ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు డ్రైవర్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు