బాబా కా ధాబా : యుట్యూబర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

7 Nov, 2020 09:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబా కా ధాబా యజమాని కాంతాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్‌ బ్లాగర్‌ గౌరవ్‌ వాసన్‌పై కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం గౌరవ్‌పై సెక్షన్‌ 420 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ అతుల్‌ కుమార్‌ ఠాకూర్‌ తెలిపారు. కాగా తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్‌ తప్పుదోవ పట్టించాడని  కాంతా ప్రసాద్‌ అక్టోబర్‌ 31న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్‌ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్‌ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్‌ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాసన్‌ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించాడు.  తనకు వచ్చిన ఫండ్స్‌ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. (సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో)

అయితే దీనికి కౌంటర్‌గా కాంతా ప్రసాద్‌ లాయర్‌ ప్రేమ్‌ జోషి మాట్లాడుతూ..వాసన్‌ చెబుతున్నట్లుగా మొత్తం డబ్బును ఇవ్వలేదని కేవలం 2.3 లక్షల చెక్‌ మాత్రమే ఇచ్చాడని పేర్కొన్నాడు. వీడియోలో వాసన్‌ కేవలం అక్టోబర్‌ 7నుంచి 10 వరకు వచ్చిన బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను మాత్రమే వెల్లడించాడని, నిజానికి ఆ తర్వాత రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందాయని ఆరోపించారు. కాగా  దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్‌ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్‌లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్‌ బ్లాగర్‌ గౌరవ్‌ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. 

మరిన్ని వార్తలు