రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

11 Mar, 2023 11:40 IST|Sakshi

పాట్నా: బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సమన్లు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ, లాలూ కుటుంబాన్ని వరుసగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా లాలూ తనయుడిని ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపింది. 

తేజస్వికి సీబీఐ సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 4న ఆయనకు తొలిసారి సమన్లు జారీ చేశారు. అంతేకాదు తేజస్వి తల్లిదండ్రులు లాలూ, రబ్రీదేవిలను ప్రశ్నించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా శుక్రవారం నాడు తేజస్వి యాదవ్‌ నివాసాలతో పాటు 24 చోట్ల రైడ్స్‌ నిర్వహించింది. 

మరోవైపు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందని బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తేజ​‍స్వి యాదవ్‌ మండిపడుతున్నారు. 

2004 నుంచి 2009 మధ్యలో లాలు రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్‌సీటీసీలో గ్రూప్‌ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూముల్ని కారుచౌక ధరకే పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్‌ నెలలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

మరిన్ని వార్తలు