గుడ్‌న్యూస్‌: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు

14 Apr, 2021 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చెమటలు పట్టిస్తున్న క్రమంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్‌ ధరల తగ్గింపునకు పన్నుల్లో కోత పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అజిత్‌ కుమార్‌ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయంలో భారీ వృద్ధిని చూపించింది. దీనికి ప్రధాన కారణం ఎక్సైజ్, సర్వీస్ ‌ ట్యాక్స్‌ ఆదాయం భారీగా పెరగడమే. ‘‘రానున్న నెలల్లో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావంతో ఉన్నాము’’ అని కుమార్‌ చెప్పారు.

కేంద్ర సర్కారు గతేడాది పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై లీటర్‌కు రూ.16 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.32.90కు చేరింది. విక్రయ ధరలో సుమారు 39 శాతం ఎక్సైజ్‌ సుంకమే. అదే విధంగా డీజిల్‌ లీటర్‌పై మొత్తం ఎక్సైజ్‌ సుంకం రూ.31.80గా ఉంది. రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కూడా కులుపుకుంటే పెట్రోల్, డీజిల్‌ విక్రయ ధరల్లో పన్నుల వాటా 55-60 శాతంగా ఉంటోంది. వెరసి కొనుగోలుదారులకు ధరలు భారంగా పరిణమించాయి. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తామన్న సీబీఐసీ చీఫ్‌ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు.

చదవండి: 

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్

మరిన్ని వార్తలు