సిలబస్‌ను 50శాతం తగ్గించే యోచనలో కేంద్రం..!

10 Oct, 2020 20:20 IST|Sakshi

న్యూఢిల్లీ : విద్యా ప్రమాణాలు అధికంగా ఉండే సీఐసీసీఈ జూన్‌లో 2020-21 ఏడాదికి సిలబస్‌ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అసాధారణ (కరోనా) పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్‌ సిలబస్‌తో విద్యార్థులకు బోధించలేమని భావించి 9 నుంచి 12వ తరగతులకు సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సీఐసీసీఈ తర్వాత సీబీఎస్‌ఈ కూడా అదే బాటలో 30 శాతం సిలబస్‌ తగ్గించింది. తొలగించిన సిలబస్‌ నుంచి పరీక్షలో ప్రశ్నలు ఏవీ రావని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈని అనుసరించి అనేక రాష్ట్ర బోర్డులు కూడా వారి సిలబస్‌లో 25శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాయి. చదవండి: 30% తగ్గనున్న సీబీఎస్‌ఈ సిలబస్‌

కాగా తాజాగా ఈ ఏడాది బోర్డు పరీక్షలను సులభతరం చేసేందుకు సిలబస్‌ను మరింత తగ్గించేందుకు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ ఆలోచనలు చేస్తున్నాయి. ఇంతకు ముందు నిర్ణయించినట్లు 30 శాతానికి బదులు 50 శాతం సిలబస్‌ తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంపై సీబీఎస్‌ఈఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రానందున ఈ ఏడాది బోర్డు పరీక్షలు 70శాతం లేదా 50 శాతం సిలబస్‌తో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు , దీనిపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చదవండి: రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..

ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోకపోవడం, ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండటం వల్ల  జాతీయ విద్యా బోర్డులు కూడా పరీక్షలను 45 నుంచి 60 రోజులు ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్నాయి. బోర్డు పరీక్షలను ఏప్రిల్‌కు మార్చే అవకాశం ఉంది. అయితే వీటిపై ఇంకా విధానాన్ని ఖరారు చేయలేదు. కాగా పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.  నాన్-కంటైనర్ జోన్లలో అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవవచ్చని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కానీ ఇప్పటికీ భారత్‌లో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపంచేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఇప్పట్లో స్కూళ్లకు పూర్తి స్థాయి హాజరు ఉండకపోవచ్చు. 

మరిన్ని వార్తలు