కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌

11 Jun, 2021 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చూస్తే జార్ఖండ్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వృథా అయినట్లు వెల్లడైంది. కోవిడ్‌ టీకా డోస్‌లను సమర్థవంతంగా వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్‌ అగ్రస్థానంలో నిలిచింది. టీకా డోస్‌ల సరఫరా, పంపిణీ సమయాల్లో కొన్ని డోస్‌లు ధ్వంసమవడం తదితరాల కారణాలతో వృథా అవుతాయి. అయితే, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేయడంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మే నెలలో ఏకంగా 1.61 లక్షల డోస్‌లను ఆదా చేయగలిగింది.

కేరళ సైతం టీకాల డోస్‌ల వృథాను అరికట్టడంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేరళ కూడా 1.10 లక్షల కోవిడ్‌ టీకాలను ఆదా చేసింది. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో 15.79 శాతం టీకాలు, మధ్యప్రదేశ్‌లో 7.35 శాతం టీకాలు వృథా అయ్యాయి. పంజాబ్‌లో 7.08 శాతం, ఢిల్లీలో 3.95 శాతం, రాజస్తాన్‌లో 3.91 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 3.78 శాతం, గుజరాత్‌లో 3.63 శాతం, మహారాష్ట్రలో 3.59 శాతం టీకాలు వృథా అయ్యాయి. మే నెలలో మొత్తంగా కేంద్రప్రభుత్వం 7.9 కోట్ల డోస్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. మేలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 2.1 కోట్ల డోస్‌లు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్‌!

మరిన్ని వార్తలు