ఎస్‌ఆర్‌ఈ పరిధిలో విశాఖ.. వారికి 6 వేల స్టైపండ్‌

16 Sep, 2020 15:29 IST|Sakshi

కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో ఈ జిల్లా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. గత ఐదేళ్లలో మొత్తంగా 95.47 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.(చదవండి: అరకు లోయ పర్యాటకులకు రైల్వే శుభవార్త

ఇందులో భాగంగా నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. లొంగిపోయినవారు వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా..  ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పలువురు ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

కేజీ బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ !
దేశవ్యాప్తంగా సహజవాయువు, పెట్రోలియం లభ్యతపై అధ్యయనం జరిగిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. తాజా అధ్యయనాల ప్రకారం 42 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ లభ్యత ఉందని అంచనాలున్నాయన్నారు. కేజీ(కృష్ణా- గోదావరి) బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ ఉందనే అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో ఎక్కువ లభ్యత ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు