పండగల నేపథ్యంలో కోవిడ్ కట్టడిపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజూ దాదాపు వెయ్యి మంది కరోనాతో కన్నుమూస్తున్నారు. రానున్న మూడు నెలలు పండుగ రోజులే. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు దాకా దేశంలో ఏదో ఒక చోట పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి వేడుకల్లో జనం భారీగా పాల్గొంటారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే చోట కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి పండుగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కట్టడి(కంటైన్మెంట్) జోన్లలో పండుగ ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్లల్లోనే పండుగలు జరుపుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రామాణిక నిర్వాహక విధానాన్ని(ఎస్ఓపీ) విడుదల చేసింది.(చదవండి: ఆరోగ్యమంత్రికి కరోనా, రాహుల్తో కలిసి వేదిక పంచుకున్న వైనం)