పెగాసస్‌పై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

16 Aug, 2021 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెగాసస్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను ​కేంద్రం కొట్టిపారేసింది. పెగాసస్‌పై నిజాలను నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపింది.

అంతే కాకుండా ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. దీనికి  మరో 2 వారాల గడువును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అయితే ఇదే చివరి అవకాశం.. మళ్లీ ఇవ్వడం కుదరదని, 10 రోజుల్లోగా నిర్ణయం చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నిపుణుల కమిటీ వేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. కోర్టు సూచించిన వ్యక్తులతో స్వతంత్ర సభ్యుల నిపుణుల కమిటీ పెగాసస్ స్పైవేర్ అంశంపై పరిశీలన చేస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగాసస్ స్పై వేర్ ఉపయోగించారా లేదా అన్న అంశం పై కేంద్రం తన అపిడవిట్‌లో స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

అయితే జాతీయ భద్రతకు సంబందించిన అంశాలు ముడిపడి ఉన్నాయని అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సోలిసిటరీ జనరల్ అంగీకరించలేదు. పెగాసస్ ఉపయోగించలేదని కేంద్రం చెప్తే పిటిషనర్లు తమ పిటిషన్స్ ఉపసంహరించుకుంటారా? అని పిటిషనర్లను సోలిసిటరీ జనరల్ ప్రశ్నించింది.  కేంద్రం చట్టం ప్రకారం వ్యవహరిస్తుందని పార్లమెంట్‌కు సమాధానం ఇచ్చిందని, నిపుణుల కమిటీ ద్వారా వాస్తవాలు బయటపెట్టడానికి ప్రయత్నిస్తుందని సొలిసిటరీ జనరల్ పేర్కొంది. కమిటీ ఏ అంశంపై దర్యాప్తు చేయాలో కోర్టే నిర్ణయించాలని సొలిసిటరీ జనరల్ కోరింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.
 

మరిన్ని వార్తలు