'స్పుత్నిక్‌'కు కేంద్రం పచ్చజెండా

14 Apr, 2021 04:26 IST|Sakshi

టీకాను రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 

న్యూఢిల్లీ: రష్యా తయారీ స్పుత్నిక్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరిం చుకుంది. దేశంలో అత్యవసర వినియోగానికి రష్యా నుంచి స్పుత్నిక్‌ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మంగళవారం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుతం కొనసా గుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా రానుంది.

‘భారత్‌లో స్పుత్నిక్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినందుకు సంతో షంగా ఉంది. భారత్‌లో కేసులు పెరుగుతున్న సమయంలో కోవిడ్‌–19పై పోరులో ఈ టీకా చాలా కీలకంగా మారనుంది. దీనిద్వారా దేశ జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి కోవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడనుంది’ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కో– చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. భారత్‌లో ఏడాదికి 850 మిలియ న్‌ డోసుల స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) తెలిపింది. స్పుత్నిక్‌ వినియోగానికి అనుమ తులిచ్చిన 60వ దేశం భారత్‌ అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు అనుమతిం చిన టీకాల్లో స్పుత్నిక్‌ రెండో స్థానంలో ఉంది. 

91.6% ప్రభావవంతం
స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్, ఉత్పత్తితోపాటు వినియోగానికి అనుమతులు లభించడం భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ డిమిట్రియేవ్‌ అన్నారు. కరోనా వైరస్‌పై స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందనీ, కోవిడ్‌–19 సీరియస్‌ కేసుల్లోనూ ఇది రక్షణ కల్పించిందని లాన్సెట్‌ వంటి ప్రముఖ మెడికల్‌ జర్నల్స్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయని ఆయన అన్నారు.

ఈ వేసవి పూర్తయ్యేలోగా నెలకు 50 మిలియన్‌ డోసులకు మించి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి అంతా దాదాపు భారత్‌లోనే జరుగుతున్నందున దీనిని భారత్‌–రష్యా వ్యాక్సిన్‌గా చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు.  ఒక్కో డోసు టీకా ఖరీదు 10 డాలర్ల లోపే ఉండగా,  రెండు డోసుల్లో పనిచేసే ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్‌తో రోగనిరోధకత ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ దీనిని నిల్వ ఉంచవచ్చన్నారు.

850 మిలియన్‌ డోసుల లక్ష్యం
భారత్‌లో స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి చేపట్టేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో గత ఏడాది  ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ 2, 3వ దశలను నిర్వహించింది. అనుమతులు లభించాక..దేశంలో ఏడాదికి 850 మిలియన్‌ డోసుల టీకాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా గ్లాండ్‌ ఫార్మా, హెటిరో, బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్‌ బయోఫార్మా, విర్చో బయోటెక్‌ వంటి ప్రముఖ సంస్థలతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.  

మరిన్ని వార్తలు