కరోనా: 12 రాష్ట్రాలతో కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష

27 Mar, 2021 19:21 IST|Sakshi

46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తింపు

కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని ఆదేశం

సాక్షి, ఢిల్లీ: కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాలపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీసింది. 46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కఠిన చర్యలు, కంటైన్మెంట్‌ జోన్లతో కట్టడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది.

త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్‌–ఉల్‌–ఫితర్‌ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్‌ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్‌లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించింది.
చదవండి:
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు
కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్‌ భేటీ

మరిన్ని వార్తలు