కేంద్రమంత్రి సతీమణి పర్స్‌ మిస్సింగ్‌.. పెద్దసంఖ్యలో రంగంలోకి పోలీసులు.. చివరకి..

14 Jul, 2022 20:27 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి ప్రతినిధి, చెన్నై: యాత్ర కోసం కన్యాకుమారి జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి భార్య మనీ పర్స్‌ కనపడకుండా పోవడం కలకలం రేపింది. పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించి పర్స్‌ను గుర్తించారు. వివరాలు.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కారత్‌ కన్యాకుమారి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

మంగళవారం ఉదయం అక్కడి సుచీంద్రం దానుమలయస్వామి ఆలయానికి సతీమణి అంజలికారత్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ అంజలీకారత్‌ తన మనీపర్స్‌ కనపడక పోవడంతో ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెదికినా పర్స్‌ కనపించలేదు. దీంతో బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆలయ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు.

ఇందిర వినాయక సన్నిధిలో ఆమె దర్శనం చేసుకునేటప్పుడు పర్స్‌ చేతి నుంచి జారి కిందపడినట్లు, దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు దాన్ని తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు చెన్నైకి చెందిన ఓ జ్యోతిష్కుడి అని తేలింది. అతడు నాగర్‌కోవిల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు కోసం వేచి ఉన్నట్లు తెలియడంతో, అక్కడికి వెళ్లి పోలీసులు పర్స్‌ను స్వాధీనం చేసుకుని కేంద్ర మంత్రి సతీమణికి అప్పగించారు.

చదవండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్‌.. 18 మంది బహిష్కరణ

మరిన్ని వార్తలు