మా వాదన వినరా?.. రాజీవ్‌ దోషుల విడుదలపై కేంద్రం అభ్యంతర పిటిషన్‌

17 Nov, 2022 22:38 IST|Sakshi

న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజీవ్‌ హత్య కేసు దోషులను విడుదల చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం. దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. 

తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని, ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని పిటిషన్‌లో పేర్కొంది కేంద్రం. గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చేందిన వారు కాగా.. ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని తెలిపింది.

ఈ కేసులో తామూ ఒక భాగమేనన్న కేంద్రం.. తమ వాదన వినకుండా విడుదల చేయడం సబబు కాదని పిటిషన్‌లో పేర్కొంది.  కేసులో ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయకుండా దోషుల శిక్ష తగ్గింపు కోరారని వివరించింది. కావున.. విడుదల ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరింది కేంద్రం.

ఇదీ చదవండి: రాజీవ్‌ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు.. సోనియా కుటుంబం క్షమించినా..

మరిన్ని వార్తలు