కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్

31 Mar, 2021 18:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక(లేబర్‌ కోడ్స్)‌ చట్టాల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్‌ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడమే ఈ వాయిదాకు కారణం. దీనితో ఈ నాలుగు లేబర్ కోడ్‌లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావు. అంటే ఉద్యోగుల టేక్-హోమ్ పే, కంపెనీల ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్‌ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది.

అయితే, ఈ కొత్త నాలుగు కార్మిక చట్టాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని గతంలోనే కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ కొత్త వేతనాల కోడ్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చేవి. రాజ్యాంగ ప్రకారం కార్మికుల అంశం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్‌ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో దీనికి కేంద్రం తాత్కాలిక వాయిదా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. ఒకవేళ ఏప్రిల్‌ 1 నుంచి కొత్త లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వచ్చి ఉంటే.. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ, యాజమాన్యాల ప్రావిడెంట్ ఫండ్ వాటా పెరిగేది. లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా పడటం వల్ల మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది.

చదవండి:

భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్!

వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా?

మరిన్ని వార్తలు