ఊరట: విదేశీయుల వీసా గడువు పొడిగింపు..

4 Jun, 2021 18:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు 31 వరకు వీసా గడువు పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం

న్యూఢిల్లీ: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో కేంద్ర అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్‌లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్‌ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది కూడా కేంద్రం దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు పెంచిన సంగతి తెలిసిందే. మహమ్మారి కారణంగా సాధారణ కమర్షియల్‌ విమాన కార్యకలాపాలు 2020 మార్చి నుంచి రద్దయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందే చెల్లుబాటు అయ్యే భారతీయ వీసాలపై మన దేశానికి వచ్చిన అనేక మంది విదేశీ పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీ పౌరులు తమ వీసా గడువును పొడిగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జూన్ 30, 2020 తర్వాత గడువు ముగిసే అటువంటి విదేశీ పౌరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జూన్ 29న వీసా గడువును పొడిగిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. 2020 సాధారణ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తేదీ నుంచి మరో 30 రోజుల వరకు వీసా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. 

తాజాగా మరో సారి ఇదే సమస్య తలెత్తడంతో ఆగస్టు 31, 2021 వరకు ఎటువంటి ఓవర్‌స్టే పెనాల్టీ విధించకుండా ఉచిత ప్రాతిపదికన దేశంలో చిక్కుకున్న వీదేశీయుల వీసా గడువు పొడగిస్తూ కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ లేదా ఎఫ్‌ఆర్‌ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్‌స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపింది. 

మరిన్ని వార్తలు