‘మేరా రేషన్‌’ యాప్‌ ప్రారంభించిన కేంద్రం

13 Mar, 2021 06:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్‌ ఇంగ్లి్లష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు. 

మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కింద జరిగాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్‌ నాటికి తక్కువ వ్యవధిలో వేగంగా విస్తరించగలిగామని అన్నారు. ప్రస్తుతం వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ నెల సగటున 1.5 –1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అవుతున్నాయని పాండే తెలిపారు.

మరిన్ని వార్తలు