కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం

20 Jun, 2021 09:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులకు రూ.4 లక్షల పరిహారం చెల్లించలేమని, పరిహారం తప్పనిసరి చేసే విపత్తు నిర్వహణ చట్టం భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వైరస్‌ కారణంగా 3.85 లక్షల మందికి పైగా కరోనా బాధితులు మరణించారని, ఇది పెరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.పెరిగిన ఆరోగ్య ఖర్చులు, తక్కువ పన్ను ఆదాయాల కారణంగా లక్షలాది మంది కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించడం రాష్ట్రాల బడ్జెట్‌కు మించినదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని విపత్తు నిర్వహణ చట్టం పేర్కొందని తెలిపింది.

కరోనా మహమ్మారి భారీ స్థాయిలో ఉన్నందున దీనిని కోవిడ్‌కు వర్తింపచేయడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిహారం ఇవ్వడానికి అరుదైన వనరులను ఉపయోగించడం, ఆరోగ్యం పై చేసే వ్యయాన్ని ప్రభావితం చేసి, మంచి కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. చాలా వరకు ప్రతి బాధితుడి మరణ ధృవీకరణ పత్రాల్లో "కోవిడ్ డెత్" అని జారీ చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇక కోవిడ్ బాధితులకు రూ.4 లక్షల పరిహారం కోరుతూ ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు?

మరిన్ని వార్తలు