తాజా సడలింపులు; వారు భారత్‌కు రావొచ్చు!

22 Oct, 2020 14:17 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరీల కింద దేశంలోకి వచ్చేందుకు విదేశీయులు, భారత పౌరులకు అనుమతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓసీఐ(ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా), పీఐఓ(పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఓరిజన్‌) కార్డు హోల్డర్ల ప్రయాణానికి అనుమతినిచ్చింది. చట్టబద్ధమైన ఎయిర్‌పోర్టులు, సీపోర్టు చెక్‌పోస్టుల గుండా వాయు, జల మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అయితే టూరిస్టు వీసా కింద దేశానికి వచ్చే ప్రయాణీకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. (చదవండి: విశాఖలో జల ప్రవేశం చేసిన ఐఎన్‌ఎస్‌ కవరట్టి)

అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణీకులు కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా ప్రకటించిన నిబంధనల్లో భాగంగా, ఎలక్ట్రానిక్‌, టూరిస్ట్‌, మెడికల్‌ వీసా మినహా మిగిలిన వీసాలన్నింటినీ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఆ వీసాల గడువు తేదీ గనుక ముగిసినట్లయితే, తాజా దరఖాస్తులతో మళ్లీ వీసా పొందవచ్చని పేర్కొంది. ఇక వైద్య చికిత్స కోసం భారత్‌కు రావాలనుకున్న విదేశీయులు మెడికల్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు