కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నారు

30 Jul, 2020 09:24 IST|Sakshi

64.51 శాతానికి చేరిన రికవరీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 దేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో సానుకూల పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య 10 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో సాధించిన ఈ ఘనతను ప్రాణాంతక వైరస్‌పై పోరాడుతున్న వైద్యారోగ్య సిబ్బందికి అంకితం చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖట ట్వీట్‌ చేసింది. భారత్‌లో కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటిన సందర్భంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య, పారిశుద్ధ సిబ్బంది సేవలను కొనియాడాల్సి ఉందని పేర్కొంది. చదవండి : అంబులెన్స్‌ .. మృతదేహమైతే లక్ష డిమాండ్‌

వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించడంతోనే కోవిడ్‌-19 రోగులు పెద్దసంఖ్యలో కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నారని ట్విటర్‌ వేదికగా ప్రస్తుతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా కరోనా టెస్టులు నిర్వహించి చికిత్స అందిస్తుండటంతో దేశంలో మరణాల రేటు కూడా తగ్గుతోందని పేర్కొంది. మరణాల రేటు జూన్‌ 19న 3.3 శాతం ఉండగా, బుధవారానికి అది 2.23 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 30,000 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని పేర్కొంది. ముంబై, ఢిల్లీ వంటి కరోనా హాట్‌స్పాట్స్‌లోనూ వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు క్రమంగా దిగిరావడం సానుకూల పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌-19 నుంచి రోగులు కోలుకునే రేటు 64.51 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు