వ్యాక్సిన్‌ పంపిణీకి కమిటీలు

31 Oct, 2020 04:26 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 టీకా పంపిణీలో సమన్వయం, పర్యవేక్షణకు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇతర సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవడంతోపాటు, సామాజిక మా«ధ్యమాల్లో టీకా సామాజిక ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపే పుకార్లను ముందుగానే కనిపెట్టి, అడ్డుకునేందుకు ఈ కమిటీలు సాయపడతాయని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమై, పలు గ్రూపుల వారికి దశలవారీగా సాగే టీకా పంపిణీ ఏడాది పొడవునా సాగే అవకాశం ఉందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు, స్థానిక అవసరాలు, వివిధ భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా నిల్వ సదుపాయాలు, కార్యాచరణ వ్యూహాలను సమీక్షిం చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

కొత్త కేసులు 50 వేల లోపే..
గత 24 గంటల్లో 48,648 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 563 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,21,090కు చేరుకుంది. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 73,73,375కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,94,386 గా ఉంది. మొత్తం  కేసుల్లో యాక్టివ్‌ కేసులు 7.35 శాతం ఉన్నాయి. రికవరీ రేటు  91 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు