రెచ్చగొట్టే హెడ్డింగులు, ఆ తరహా కథనాలు వద్దు: టీవీ ఛానెళ్లకు కేంద్రం ఘాటు హెచ్చరిక

23 Apr, 2022 16:35 IST|Sakshi

వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్‌,  సంచలనాల పేరిట ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయొద్దంటూ  టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురకలంటించింది. న్యూస్‌ ఛానెల్స్‌లో టెలికాస్ట్‌ చేసే కంటెంట్‌ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ.. శనివారం ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, జహంగీర్‌పురి హింస నేపథ్యంలో.. పలు మీడియా ఛానెల్స్‌ వ్యవహరించిన తీరు దృష్టికి రావడంతో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందించింది. ఉక్రెయిన్‌ పరిణామాలపై.. చాలావరకు న్యూస్‌ యాంకర్లు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, ట్యాగ్‌ లైన్‌లు తగిలించడం దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది. 

అలాగే ఢిల్లీ జహంగీర్‌పురి హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్‌ వ్యవహరించిన తీరు.. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. అలాగే టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్‌ సందర్భంగా ఘటనలకు సంబంధించి.. నీచమైన భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్‌ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. 

కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం 1995 ప్రకారం.. టీవీ ఛానెల్స్‌ నడుచుకోవాలి.

కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు.

► ఇంకొకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు.
 
► తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు

► తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వద్దు. 

► జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు

 అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు

► సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయొద్దు

► కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు.

► వివిధ వర్గాల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే కథనాలు వద్దు. 

మరిన్ని వార్తలు