‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’పై నిషేధం

5 Jun, 2022 06:28 IST|Sakshi

నెలాఖరుకల్లా పూర్తిస్థాయి అమలు

రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్రం ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ కార్యక్రమాన్ని ఆరంభించనుంది. దేశాన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహితంగా మార్చే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఆ ప్లాస్టిక్‌ వాడకాన్ని ఈ నెలాఖరుకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ, స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీని పంపింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆదేశాల మేరకు 2,591 నగర మున్సిపాలిటీలు ఆ ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేశాయి.

మరో 2,100 నగర మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 30లోగా నిషేధం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ఎక్కువగా వాడుతున్న ‘హాట్‌ స్పాట్‌’లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన బాధ్యత పట్టణప్రాంత స్థానిక సంస్థలదే అని కేంద్రం స్పష్టంచేసింది. ఆ ప్లాస్టిక్‌ వినియోగం నిషేధాలను అమలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల సాయం తీసుకోవాలంది. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు, ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనులపై భారీ జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. దేశంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం/ వాడి పడేసిన ప్లాస్టిక్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌ల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది.

మరిన్ని వార్తలు