2022లో చంద్రయాన్‌–3

22 Feb, 2021 05:31 IST|Sakshi

న్యూఢిల్లీ: చంద్రునిపైకి మూడో మిషన్‌ ప్రయోగం చంద్రయాన్‌–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ వెల్లడించారు. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్‌–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్‌–3ని 2020 చివర్లో ప్రయోగిం చాల్సి ఉందన్నారు. చంద్రయాన్‌–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్‌–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్‌–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైన విషయం తెలిసిందే.

ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్‌–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్‌లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్‌లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్‌ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్‌ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్‌ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. సరైన సమయంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు