కరోనా ఎఫెక్ట్‌: చార్‌ధామ్‌ యాత్ర రద్దు చేసిన ఉత్తరాఖండ్‌

29 Apr, 2021 12:32 IST|Sakshi

రాంచి: చార్‌ధామ్‌ యాత్రపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కేవలం నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే పూజలు, ఇతర సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్ వెల్ల‌డించారు. మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో చార్‌ధామ్ దేవాలయాలు ఉన్నాయి. బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలను చార్‌ధామ్ అంటారు.

కాగా క‌రోనా సెకండ్ వేవ్ వ‌ణికిస్తున్న స‌మ‌యంలో కూడా కుంభ‌మేళాను కొన‌సాగించింది ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం. కుంభ‌మేళా కారణంగా రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ప్రత్యేకంగా సమావేశ‌మై చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో కరోనా కోవిడ్‌ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. సిబ్బంది కొరతతో ఉత్తరాఖండ్‌  ఉక్కిరిబిక్కిరవుతోంది.  డెహ్రాడూన్‌, హల్ద్వానీ, హరిద్వార్‌లో టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు 30-50 వేల కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు పేర్కొంది. అలాగే  2,500 మంది రిజిస్టర్ డెంటిస్టుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది. హోం ఐసోలేషన్‌లోని వారికి తగిన వైద్య సేవలు కల్పించాలని తెలిపింది.
చదవండి: కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు

మరిన్ని వార్తలు