మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ 

10 May, 2021 00:58 IST|Sakshi

రాయ్‌పూర్‌: లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూసేసినప్పటికీ మందుబాబులకు చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే... మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేందుకు అనుమతించింది. కల్తీ మద్యం, శానిటైజర్లను తాగి ప్రజలు చనిపోతున్నందువల్ల, అక్రమ మద్యం తయారీ, అమ్మకాలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి మద్యం హోం డెలివరీ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా హోం డెలివరీలు ఇవ్వొచ్చు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి... మొత్తం డబ్బును చెల్లిస్తే సమీపంలోని వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా జరుగుతుందని చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎంసీఎల్‌) తెలిపింది. సీఎస్‌ఎంసీఎల్‌ వైబ్‌సైట్లో, మొబైల్‌ యాప్‌లో ఆర్డర్లు పెట్టొచ్చని వివరించింది. హోం డెలివరీ ఇచ్చినందుకు వంద రూపాయలు అదనంగా ఛార్జి చేయనున్నారు. గత ఏడాది దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉన్నపుడు కూడా చత్తీస్‌గఢ్‌ మద్యం హోం డెలివరీని అనుమతించింది. రాష్ట్ర బీజేపీ దీన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కరోనా చికిత్సకు వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాల్సింది పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేత ధరమ్‌లాల్‌ విమర్శించారు.  

చదవండి:  (2 వారాలు సర్వం బంద్‌.. నేటి నుంచి పూర్తి లాక్‌డౌన్‌)

మరిన్ని వార్తలు